నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలి
- వేసవి సెలవులలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు చేపట్టాలి
- ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న స్కూల్ పై చర్యలు తీసుకోవాలి

కొత్తగూడెం : ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి, ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద నాగక్రిష్ణ డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం మండల కేంద్రంలో వేసవి సెలవులలో తరగతి గదులు నిర్వహిస్తున్న పాఠశాలలను మంగళవారం మూసి వేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నాగక్రిష్ణ మాట్లాడుతూ జిల్లాలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్న వేళ విద్యార్థులకు ఉదయం నుండి సాయంత్రం వరకు తరగతులు నిర్వహిస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారన్నారని విమర్శించారు.
విద్యార్థులను పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తక్షణమే జిల్లా విద్యాధికారి స్పందించి ఇలా సెలవుల్లో పాఠశాలలు నిర్వహించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బయట వ్యక్తులకు తెలియకుండా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం యూనిఫాం లేకుండా సివిల్ డ్రెస్ లో పాఠశాలకు రావాలని ఆదేశిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పాఠశాల యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోకపోతే పాఠశాలల లోపలికి వెళ్లి విద్యార్థులను బయటికి పంపిస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రిశ్వత్ , నాని తదితరులు పాల్గొన్నారు.