450 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు
- నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు
- జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) కింద పంపిణీ అయ్యే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై జిల్లా యంత్రాంగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సమన్వయ దాడుల్లో మొత్తం 450 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శనివారం తెల్లవారుజామున సివిల్ సప్లై అధికారులు, పోలీస్ విభాగం కలిసి నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో భాగంగా ఇల్లెందు మండలం రేపల్లెవాడలోని కోట మైసమ్మ గుడి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఒక లారీ, ఒక బొలెరో వాహనాలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. టేకులపల్లి మండలంలో సుమారు 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రానికి తరలించే ప్రయత్నంలో ఉన్న లారీని పట్టుకున్నారు. ఈ బియ్యం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి మళ్లించేందుకు యత్నించినట్లు ప్రాథమిక విచారణలో బయటపడినట్లు తెలిపారు.
నిందితులపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (టీఎస్ పిడీఎస్) కంట్రోల్ ఆర్డర్ నిబంధనలు మరియు భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) కింద కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై సమాచారం అందించేందుకు ముందుకు రావాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు.ఈ దాడుల్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, సివిల్ సప్లై అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.