సైబర్ నేరగాళ్ళకు చెక్ పెట్టి భద్రాద్రి పోలీసులు
- బాధితుడికి రూ 3.21లక్షల రిఫండ్
- గోల్డెన్ అవర్లో ఫిర్యాదుతో రికవరీ అవకాశం
- అప్రమత్తతే ప్రధాన ఆయుధం
- డిఎస్పి అబ్దుల్ రహమాన్

భద్రాద్రి : సైబర్ నేరగాళ్ళకు చెక్ పెట్టి భద్రాద్రి పోలీసులు బాధితుడికి రూ 3.21లక్షలు తిరిగి ఇప్పించారు. గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తే రికవరీ అవకాశాలు అధికంగా ఉంటాయని డిఎస్పి అబ్దుల్ రహమాన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిస్పి మాట్లాడుతూ జూలూరుపాడు మండలానికి చెందిన జ్యోతిబసు సైబర్ నేరగాళ ఉచ్చులో పడి తన ఖాతాలోని రూ 3లక్షల 21వేలు పోగొట్టుకున్నాడని తెలిపారు. కోల్పోయిన నగదును జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు, జూలూరుపాడు పోలీస్ అధికారుల సహాకారంతో తిరిగి అతని ఖాతాలో జమ చేసేలా కృషి చేశారని పేర్కొన్నారు. నెల క్రితం చుంచుపల్లిలోని ఒక పెట్రోల్ బంకు వద్ద ఆటో డ్రైవర్ జ్యోతిబసుకి ఓ వ్యక్తి పరిచయమై అతని వద్ద నుండి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా రూ 3.21లక్షలు మోసం చేసినట్టు వెల్లడిరచారు. బాధితుడు కొత్తగూడెం సైబర్ సెక్యూరిటీ బ్యూరోను సంప్రదించి ఫిర్యాదు చేయగా తక్షణమే స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల అకౌంట్లోని బాధితుని డబ్బును ఫ్రీజ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. అనంతరం జూలూరుపాడు పోలీస్ అధికారుల సహాయంతో కోర్టు ఉత్తర్వుల ద్వారా బాధితుడికి తను కోల్పోయిన సొమ్మును తిరిగి అకౌంట్లో జమ చేశారని చెప్పారు.
సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని,ఎవరైనా కొత్త వ్యక్తులు మీ వద్దకు వచ్చి,ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాము నగదు ఇవ్వండి అని సంప్రదిస్తే వాళ్లు కచ్చితంగా సైబర్ నేరస్తులే అయి ఉంటారని గ్రహించాలి అన్నారు. జిల్లాలో గత కొంతకాలంగా నమోదవుతున్న డిజిటల్ అరెస్ట్,ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్ వంటి సైబర్ నేరాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. సిబిఐ, ఈడి,ఐబి, ఆర్ఎడబ్ల్యూ వంటి ప్రముఖ ఏజెన్సీల పేరుతో నకిలీ అధికారులు ఆడియో,వీడియో కాల్స్ ద్వారా డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరగాళ్ళు విచారణ పేరుతో బ్యాంక్ అకౌంట్లు,ఫిక్స్డ్ డిపాజిట్ వివరాలు అన్నీ తెలియజేయాలని బెదిరిస్తే నమ్మి మోసపోవద్దని కోరారు.స్థానిక పోలీసుల ముందస్తు సమాచారంతో మాత్రమే ఎటువంటి విచారణయినా జరుగుతుందని ప్రజలు గ్రహించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సైబర్ నేరాల నివారణకు అప్రమత్తతే ప్రధాన ఆయుధమని,సైబర్ నేరాలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,అపరిచిత వ్యక్తులు,అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ కు,మెసేజ్ లకు స్పందించవద్దని,సైబర్ నేరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో గాని,జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో గానీ లేదంటే 1930 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి అన్నారు. డిఎస్పి అబ్దుల్ రహమాన్ సైబర్ క్రైమ్ డిఎస్పి అశోక్, వన్ టౌన్ సిఐ ఎం కరుణాకర్తో కలిసి బాదితుడికి రిఫండ్ అయిన పత్రాన్ని అందజేశారు.