కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలి
- ఐఎన్టియూసి డిమాండ్

సింగరేణి : కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను చట్టబద్రత లేని నాలుగు కోడ్స్గా కుదించడాన్ని అన్ని కార్మిక సంఘాలు ఖండిస్తున్నాయని ఐఎన్టియూసి సింగరేణి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రసిడెంట్ ఎండి రజాక్ అన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలోని మైన్స్, ఓపెన్ కాస్ట్, డిపార్ట్మెంట్లలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా రజాక్ మాట్లాడుతూ సెక్రటరీ జనరల్, ఐఎన్టీయూసీ, తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ ఆందోళనలో ఐఎన్టియూసి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరన వ్యక్తం చేశారని తెలిపారు. దేశీయ పారిశ్రామిక రంగాన్ని విదేశీ పెట్టుబడిదారులకు ధారాధత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు.
కొత్తగూడెం ఏరియా బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్, అన్ని డిపార్ట్మెంట్లు, కార్యాలయాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున కొత్త లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గని యాజమాన్యాలకు మెమోరాండాలు అందజేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కోడ్స్ పత్రాలను దహనం చేసి తమ నిరసన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో జెఏసి నాయకులు సెంట్రల్ కమిటీ నాయకులు, బ్రాంచ్ కమిటీ నాయకులు, ఫిట్ కార్యదర్శిలు, ఆర్గనైజ్ సెక్రటరీ, ఆల్ కమిటీ మెంబర్స్ పాల్గొని విజయవంతం చేశారు.