పదోన్నతులు కల్పించాలి టిపిటిఎఫ్ నిరసన
- పండిట్స్,పిఈటి పోస్టులను అప్గ్రేడ్ చేయాలి
- సిఆర్ టిలను,డైలీ వేజెస్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలి
- టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్

టేకులపల్లి : గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలలో పనిచేస్తున్న పండిట్స్,పిఈటి పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలి, ,సిఆర్టిలను,డైలీ వేజెస్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని,అప్పటివరకు మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టిపిటిఎఫ్) టేకులపల్లి మండల కమిటి ఆధ్వర్యంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల కోయగూడెంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ యాజమాన్యంలో పండిట్,పీఈటి పోస్టులు లేవని,అన్ని యాజమాన్యాలలోని పండిట్స్,పిఈటి పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేసి పదోన్నతులు ఇచ్చారని,కేవలం గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలలో మాత్రమే పండిట్,పిఈటి పోస్టులు కొనసాగుతున్నాయని అవేదన వ్యక్తం చేసారు. తక్షణం వాటిని అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలి అన్నారు.
గత 25 ఏళ్లుగా గిరిజన సంక్షేమ శాఖలో సిఆర్టిలు అతి తక్కువ వేతనంతో పనిచేస్తూ జీవితాన్ని గిరిజన సంక్షేమ శాఖకు అంకితం చేశారని స్పష్టం చేశారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని, అప్పటివరకు మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని తెలిపారు. 30 సంవత్సరాలుగా డైలీ వేజెస్ వర్కర్లు చాలీచాలని వేతనంతో పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం వేతనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. విద్యాశాఖలో మాదిరిగానే గిరిజన సంక్షేమ శాఖలో బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని,కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు పాటర్న్ ప్రకారం రెగ్యులర్ పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వసతి గృహాలను ఆశ్రమ పాఠశాలలుగా కన్వర్ట్ చేసి పదవ తరగతి వరకు ఉన్నతీకరించాలని,అన్ని ఆశ్రమ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య , సెక్షన్ల ఆధారంగా పోస్టులను మంజూరు చేయాలి ఆన్నారు. అన్ని ప్రాథమిక పాఠశాలలకు పిఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని,317 జీవో అప్పీల్స్ అన్నింటిని పరిశీలించి, పరిష్కరించి వారికి న్యాయం చేయాలన్నారు. జీవో 317 బాధిత ఉపాధ్యాయులకు కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలల్లో డిప్యూటేషన్ అవకాశాలు కల్పించాలని,గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు కామన్ సర్వీస్ రూల్స్ ను రూపొందించి గ్రేడ్ వన్ హెచ్డబ్ల్యుఓ ,ఏటిడిఓ,డిటిడిఓ,డిడిలుగా ప్రమోషన్లలో అవకాశం కల్పించాలని వెల్లడించారు.
అన్ని జిల్లాలలో ఒకే విధమైన పరిపాలన, పర్యవేక్షణ అకాడమిక్ విధానం అమలు చేయాలని,గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలకు,ఆశ్రమ ఉన్నత పాఠశాలకు సర్వీస్ పర్సన్లను నియమించాలని, ఆశ్రమ పాఠశాలలకు ప్రత్యేక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేయాలని కోరారు. జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలా ఆశ్రమ ఉన్నత పాఠశాలలకు అన్ని రకాల గ్రాంట్లు మంజూరు చేయాలని పేర్కొన్నారు. సిఆర్టిలకు,డైలీ వేజెస్ వర్కర్లకు ప్రతినెల ఒకటవ తేదీనే జీతాలు చెల్లించాలని,డైట్ బిల్లులు నెలవారిగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 24న ఐటీడీఏ భద్రాచలం ఎదుట,డిసెంబర్ 12న గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం హైదరాబాదు ఎదుట నిరసన ప్రదర్శన చేపడతామని అన్నారు. భవిష్యత్ పోరాటాలలో ఉపాధ్యాయులు,సిఆర్టిలు,డైలీ వేజెస్ వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ నిరసన ప్రదర్శనలో టేకులపల్లి మండల కార్యదర్శి బి వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు బి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు బి అమర్ సింగ్, బి కిషోర్ సింగ్, ఈపి రాజు, బాలరాజు, సైదులు, తారాబాయి, హాము, రాంబాబు, లక్ష్మీనారాయణ, మంగమ్మ,జి రవికుమార్, భద్రు, బుచ్చయ్య, సునీత డైలీ వేజెస్ వర్కర్లు నాగులు, వెంకట్రాం, ఎర్రమ్మ, ధనమ్మ, బాలమ్మ, రాధ పాల్గొన్నారు.