డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చి దిద్దాలి
- నెల రోజులపాటు అవగాహన కార్యక్రమాలు
- చైతన్యం పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్ఎలా స్పీ రోహిత్ రాజు అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం చైతన్యం పోస్టర్ ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు చైతన్యం పేరుతో పలు కార్యక్రమాలను చేపడుతున్నామని వెల్లడించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల సమూల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు భాద్యతను నిర్వర్తించాలని తెలిపారు.
చైతన్యం పేరుతో నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి వంటి మత్తు పదార్ధాల నిర్మూలన కోసం అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ నెల రోజుల పాటు జిల్లా పోలీసులు చేపట్టే కార్యక్రమాలలో ప్రజలు కూడా భాగస్వాములై తమ వంతు భాద్యతగా సహకారం అందించాలని కోరారు. మత్తుకు బానిసలుగా మారిన యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అవేదన వ్యక్తం చేసారు. వారిలో చైతన్యం నింపేందుకే ప్రత్యేకంగా ఈ కార్యమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు.జిల్లాలోని గంజాయి హాట్స్పాట్స్ లో నిత్యం తనిఖీలు చేపట్టడం,ఎవరైనా మత్తు పదార్దాలను సేవిస్తూ పట్టుబడితే వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం,వాహన తనిఖీలు వంటి కార్యక్రమాలను ఒక ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఎవరైనా నిషేదిత గంజాయిని రవాణా చేస్తున్నట్లు, విక్రయిస్తున్న, సేవిస్తున్నట్లు సమాచారం తెలిస్తే పోలీసులకి వెంటనే సమాచారం అందించాలని కోరారు. చైతన్యం పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పీ చంద్రభాను, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి, పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు తదితరులు పాల్గొన్నారు.