బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ కల్పించాలి
- కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం తేవాలి
- కాంగ్రెస్ నాయకుల డిమాండ్

కొత్తగూడెం : దేశవ్యాపతంగా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో నష్టపోయిన బీసీ సమాజానికి న్యాయం దక్కాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కు కాంగ్రెస్ పార్టీ పరంగా సంపూర్ణంగా మద్దతు ప్రకటించి, బంద్ విజయవంతం కోసం కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద శనివారం ధర్నా, ర్యాలీ నిర్వహించారు.బిసి రిజర్వేషన్లను జనాభాకు అనుగుణంగా పెంచి రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ లో చేర్చి, పార్లమెంట్లో చట్టం చేసి బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, కోనేరు చిన్ని మాట్లాడుతూ రిజర్వేషన్ అమలు విధానంలో తమిళనాడుకు ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.
జనాభా పెరిగిన దృశ్య దేశం మొత్తం ఒకే విధానాన్ని కొనసాగించి 50శాతం జర్వేషన్ల నిబంధనను తొలగించి జనాభా నిష్పత్తి ప్రకారమే రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. కోర్టుల ద్వారా కేసులు వేసి సాంకేతికంగా బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడమంటే బీసీల నోటికాడి బుక్కను లాక్కోవడమేనని మండిపడ్డారు. న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించడం కాదు, న్యాయపరమైన సాంకేతిక అడ్డంకులు తొలిగేలా పరిష్కారం చూపేలా పార్లమెంట్లో చట్టం చేసి కేంద్రం చిత్తశుద్ధిని చాతుకోవాలి అన్నారు. అగ్రకుల రిజర్వేషన్ల కల్పనతో 50శాతం రిజర్వేషన్ల నిబంధన దాటిపోయిందన్నారు. వాటికి రాని అడ్డంకి బీసీలకు ఎందుకని ప్రశ్నించారు. అగ్రకుల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేటప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు స్వాగతించామని గుర్తు చేశారు.
42 శాతం బిసి రిజర్వేషన్కు అడ్డంకులు కల్పించడం న్యాయం కాదని మండిపడ్డారు. ఎస్సీ , ఎస్టీ సంఘాలను, పీడిత వర్గాలనంతా ఏకం చేసి 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, టెలికాం బోర్డు సభ్యులు బోదాసు కనకరాజు, ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం, సోసైటీ చైర్మన్ హనుమంత్ రావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటికార్తీక్, బాల పాసి, కె కిషన్, అచ్చా నాగరాజు, మైనారిటీ నాయకులు యూత్ కాంగ్రెస్ శ్రేణులు పాల సత్యనారాయణ రెడ్డి, మహిళా నాయకులు హైమావతి, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.