నిర్భందాలు కొత్తేమీ కాదు
సిపిఐ, సిపిఎం నేతల అరెస్ట్

కొత్తగూడెం : విభజన చట్టాలను తుంగలో తొక్కి రాజకీయ కక్షతో తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీకి తెలంగాణ గడ్డపై అడుగు పెట్టే నైతిక హక్కు లేదని, గడిచిన ఎనిమిదేళ్ళలో తెలంగాణకు ఏం చుశారో చెప్పాలని నిలదీస్తున్న తెలంగాణ సమాజానికి సమాదానం చెప్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా ప్రశ్నించారు. మోడీ తెలంగాణ పర్యటను నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చిన నేపద్యంలో సిపిఐ, సిపిఎం నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామున ఇండ్లలో నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్భందించారు. మోడీ గోబ్యాక్ అంటూ పోలీస్ స్టేషన్లలో నిరసనను వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటులో కేంద్రం తెలంగాణ పట్ల వివక్షత చూపుతుందన్నారు. నోట్ల రద్దు, జిఎస్టీ, బ్యాంకుల విలీనం, రైతు చట్టాలు, అగ్నిపథ్ వంటి ఆనాలోచిత విధానాలతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైందన్నారు. పెట్రోల్ డీజిల్, గ్యాస్ నిత్యావసర వస్తువులు, రైల్వే చార్జీల పెంపు వంటి చర్యలు ఆదానీ అంబానీలను కుబేరులను చేస్తే దేశ ప్రజలను దివాలా తీయించాయన్నారు. మతోన్మాదాన్ని పెంచిపోషిస్తూ ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నారని, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న బిజెపికి తెలంగాణలో స్థానం ఇవ్వబోమన్నారు. తెలంగాణలో మోడీ అడుగు పెట్టిన నవంబర్ 12 ముమ్మాటికి ప్రజలకు చీకటి రోజేనని అన్నారు. రామగుండంలో అరెస్టు చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు రాష్ట్ర వ్యాపితంగా అరెస్టు చేసిన నాయకులు, కార్యకర్తలను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టైన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, దుర్గరాశి వెంకటేశ్వర్లు, వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు జి.వీరస్వామి, కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, దీటి లక్ష్మిపతి, గుండు శ్రీనివాస్, ఎస్ కెఫహీమ్, భూక్య శ్రీనివాస్, నాయకులు మాచర్ల శ్రీనివాస్, నేరెళ్ళ శ్రీనివాస్, నూనావత్ గోవిందు, కొవ్వూరి రాజేశ్వర్రావు, బోయిన విజయ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా నాయకులు భూక్య రమేష్, నాగేశ్వర్రావు, జునుమాల నగేష్ తదితరులు ఉన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, జిల్లా సమితి సభ్యులు వి. పూర్ణచందర్ రావు, వర్కర్స్ యూనియన్ నాయకులు దమ్మాలపాటి శేషయ్య, వంగా వెంకట్ తదితరులు అరెస్టైన నేతలను పరామర్శించారు.