నీట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
- పరీక్షా కేంద్రాలకు చేరుకొనేలా క్యూఆర్ కోడ్
- సీసీ కెమెరాల నిఘాలో పరీక్షా కేంద్రాలు
- జిల్లా ఎస్పి రోహిత్ రాజు

కొత్తగూడెం: నీట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పి ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే అధికారులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు.ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పి మాట్లాడుతూ ఈ నెల 4న మధ్యాహ్నం 2గంటల నుండి 5 గంటల వరకు జరగనున్న నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాలయిన కొత్తగూడెంలోని సింగరేణి ఉమేన్స్ కళాశాల,పాల్వంచ లోని టిజిఎస్డబ్యూఆర్ల్ స్కూల్ అండ్ జూనియర్ కల్స్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (కెఎస్ఎం) కాలేజీలో నీట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే అధికారులతో జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ గారు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పలు సూచనలను చేశారు. అభ్యర్థులంతా అడ్మిట్ కార్డు నందు సూచించబడిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి అన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇస్తామన్నారు. పరీక్షా కేంద్రానికి హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను,ఆభరణాలను, షూస్,సాక్స్,బెల్ట్లు బ్యాగులు లాంటివి అనుమతి లేదన్నారు. ఇలాంటివి ఏమీ లేకుండా అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని ఎస్పి అభ్యర్థులకు సూచించారు.పరీక్ష కేంద్రం ప్రవేశద్వారం వద్ద పురుషులను,స్త్రీలను వేరు వేరుగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని తెలిపారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు, గుర్తింపు కార్డు, రెండు పాస్పోర్ట్ ఫోటోలు, ఒక పోస్ట్ కార్డు సైజు ఫోటోను తమ వెంట తప్పనిసరిగా తీసుకొని రావాలి అన్నారు. పరీక్షా కేంద్రాలు పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఉంటుందని, పరీక్షా కేంద్రాల నుండి 200 మీటర్ల దూరంలో ఎవరూ ఉండరాదని హెచ్చరించారు.
పరీక్ష రోజున పరీక్షా కేంద్రాలకి దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్లు,కంప్యూటర్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ప్రతి ఒక్కరిని ముందుగానే బయోమెట్రిక్ ద్వారా చెక్ చేసి,పరీక్ష రాసే సమయంలో వీడియోగ్రఫీ చేయబడుతుందని స్పష్టం చేశారు. జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాలలో హాజరు కానున్న అభ్యర్థుల కోసం కొత్తగూడెం బస్టాండు,రైల్వే స్టేషన్, ప్రధాన కూడళ్లలో,బస్సులు ఆగు స్థలాలలో పరీక్షా కేంద్రాలకు చేరుకొనేలా క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచుతామన్నారు.అభ్యర్థులు పరీక్ష రాయడానికి ఎలాంటి పెన్నులు,పెన్సిల్స్ తీసుకురావద్దు.పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు ప్రతి ఒక్కరికి బ్లాక్ బాల్ పెన్ ఇస్తారు. పరీక్షకు హాజరయ్య అభ్యర్థులతో పాటు ఇన్విజిలేటర్లకు సంబంధించిన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని తేల్చి చెప్పారు.