సింగరేణి మెరిట్ స్కాలర్ షిప్ రూ16 వేలకు పెంపు
కనీస అర్హత 8 వేల ర్యాంక్ వరకు అవకాశం

సింగరేణి : సింగరేణి యాజమాన్యం కార్మికులు, అధికారుల పిల్లలకు ఇస్తున్న వార్షిక మెరిట్ స్కాలర్ షిప్ మొత్తాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్స్, ఎయిమ్స్ తదితర కోర్సుల ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన కార్మికుల, అధికారుల పిల్లలకు రూ16 వేలకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. కనీస ర్యాంక్ 2వేల నుండి 8 వేలలోపు ర్యాంక్ సాధించిన విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్ పెంచినట్లు బుధవారం సంస్థ ప్రకటనలో తెలిపింది. కార్మికుల పిల్లలను ఉన్నత చదువుల పట్ల ఆసక్తి పెంచడానికి, ప్రోత్సహించడానికి 1998లో ఈ స్కాలర్ షిప్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. 2వేల లోపు ర్యాంకు సాధించిన ఉద్యోగుల పిల్లలకు మాత్రమే దీనిని వర్తింపజేశారు.
అన్ని ఏరియాల నుండి అర్హులు ఉండి దరఖాస్తులు స్వీకరించి, సదరు విద్యార్థి చదివే కోర్సు పూర్తయ్యేంతవరకు ఏడాదికి రూ 6వేల చొప్పున స్కాలర్ షిప్ను సంస్థ ప్రతి ఏడాది అందిస్తుంది. స్కారల్ షిప్ మొత్తాన్ని పెంచాలని వచ్చిన విజ్ఞప్తి మేరకు 2010లో దీనిని రూ 10 వేలకు పెంచింది సింగరేణి సంస్థ. అయితే ఇటీవల గుర్తింపు కార్మిక సంఘంతో జరిగిన నిర్మాణాత్మక సమావేశంలో స్కాలర్షిప్గా చెల్లించే మొత్తాన్ని రూ10 నుండి రూ16 వేలకు పెంచాలని, స్కాలర్షిప్ వర్తింపును 2వేలలోపు నుండి 8వేల ర్యాంకు వరకు పెంచాలని గుర్తింపు సంఘం నాయకులు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. దీనికి సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ సానుకూలంగా స్పందించారు. ఆయన ఆదేశం మేరకు సవరించిన స్కాలర్ షిప్కు సంబంధించిన సర్క్యులర్ డైరెక్టర్ పా జారీ చేశారు.
ఈ ఉత్తర్వులు 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు వర్తిస్తుందని, ఈ మేరకు అన్ని ఏరియాల నుండి జూన్ 15 లోపు దరఖాస్తులు పంపాలని డైరెక్టర్ పా వెల్లడిరచారు. ఎంసెట్ ప్రవేశ పరీక్షల్లో 8 వేల ర్యాంకు వరకు సాధించిన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యేంత వరకు ఏడాదికి రూ 16 వేల చొప్పున స్కాలర్ షిప్గా సంస్థ చెల్లిస్తుందని, జేఈఈ మెయిన్స్ (ఎన్.ఐ.టి), ఎయిమ్స్, బిట్ సాట్ (బిట్స్-పిలాని)లో ప్రవేశం పొందితే అత్యుత్తమ ర్యాంకు ఆధారంగా స్కాలర్ షిప్ వర్తింపజేస్తామన్నారు.ఈ సదవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.