హాస్టల్లో కలెక్టర్ బస
- ఆశ్రమ గురుకుల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ

కొత్తగూడెం : ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చదువు కొనసాగించేలా అనుకూల పరిస్థితులు కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులు ఆదేశించారు.పాల్వంచ మండలంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై వారికి అందుతున్న ఆహారం, సమస్యలను అడిగి స్వయంగా తెలుసుకున్నారు. మంచినీటి ట్యాపుల లీకేజ్ను గమనించిన కలెక్టర్ స్వయంగా టాప్ ను బిగించారు.డైనింగ్ హాల్, క్లాస్ రూమ్లు, పరిసరాలు, స్టోర్స్, వంట గదులను స్వయంగా తనిఖీ చేశారు.
కిచెన్ షెడ్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం తయారిని, విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నం పరిశీలించారు. వంటకు పరిశుభ్రమైన నీటిని వినియోగించాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భోజనం వండటానికి ముందే ప్రతి రోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాసిరకం, నాణ్యతాలేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని హెచ్చరించారు. వసతి గృహం, పాఠశాలలో విద్యార్థులకు కావలసిన ఏర్పాట్లు, వసతులు నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ విద్యార్థులను ప్రత్యేకంగా చదివిపించి వారిలోని ప్రతిభను పరీక్షించారు. ప్రత్యేకించి పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటిస్తూ పరీక్షల సమయంలో ఒత్తిడిని ఎలా అధిగమించాలో సూచనలు, సలహాలు చేశారు. ప్రణాళికాబద్దంగా ప్రతిభను మెరుగు పరుచుకుని చదువుల్లో రాణించి ఉన్నత చదువులు చదివి జీవితంలో మంచి గుర్తింపు పొందాలని అకాంక్షించారు.కల్టెర్ విద్యార్థులతో కలిసి రాత్రి హాస్టల్లోనే బస చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో కలెక్టర్ స్వయంగా విద్యార్థులతో కలిసి బస చేస్తుండటంతో పట్టలేని ఆనందంలో మునిగితేలారు. ఈ విషయం తెలిసిన జిల్లా ప్రజలు కలెక్టర్ సాబ్ మీరు సూపర్ అంటూ కితాబ్ ఇస్తున్నారు. కలెక్టర్ వెంట పాఠశాల హెడ్మాస్టర్ బద్రు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.