బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చి దిద్దాలి
- జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలి
- పిల్లల సంరక్షణ అందరి భాద్యత
- కలెక్టర్ జితేష్ వి పాటిల్

కొత్తగూడెం : బాల కార్మిక వ్యవస్థను అరికట్టి జిల్లాను బాలకార్మిక రహిత జిల్లాగా తీర్చి దిద్దాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో దీనిపై విస్తృత ప్రచారం కల్పిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఐడిఓసి కార్యాలయంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డిసిపియూ) సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కోళ్ల ఫామ్స్, ఇటుక బట్టీలు, షాపింగ్ మాల్లో అన్నిచోట్ల ముమ్మర తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. మణుగూరులో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ గృహం జిల్లా కేంద్రం దూరంగా ఉండి పర్యవేక్షించడానికి అనువుగా లేదన్నారు.
కొత్తగూడెంలో బాలల సంరక్షణ గృహం ఏర్పాటుకు ప్రణాళికల రూపొందించాలి అన్నారు. మణుగూరులోని బాలల సంరక్షణ గృహాన్ని సిడిపిఓ కార్యాలయంగా మార్చాలని అధికారులకు సూచించారు. సంరక్షణ గృహాలలో నెలకొన్న సమస్యల పరిష్కార చర్యలపై వారంలోగా సమగ్ర నివేదిక అందిస్తే పరిష్కరిస్తాము అన్నారు. సంరక్షణ గృహాలలో పిల్లల ఆరోగ్య పై శ్రద్ధ చూపించాలని, ఏదైనా పెద్ద ఆనారోగ్య సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పిల్లలకు నెలకి ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని, జిల్లాలో బాల్య వివాహాలు అరికట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థినిల హాజరు పర్యవేక్షించాలని పది రోజుల కంటే ఎక్కువ సెలవులు ఉన్న విద్యార్థినిలపై దృష్టి సారించాలి అని చెప్పారు.
ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నార, వివాహం జరిగిందా అని విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పిల్లల సంరక్షణ మన అందరి బాధ్యత అని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పిల్లల సంరక్షణ చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఎన్ని పోక్సో కేసులు నమోదయ్యాయి, జిల్లా స్థాయి, మండల, గ్రామ స్థాయిలలో నమోదు అయిన కేసుల పూర్తి వివరాలను వారం రోజులలోగా నివేదిక అందించాలి అన్నారు. ఈ నివేదికల ద్వారా ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ పోక్సో కేసు నమోదు అయ్యాయో ఆ ప్రాంతంలో అవగాహన సదస్సులు, సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపడతామని కలెక్టర్ అన్నారు.

చైల్డ్ హెల్ప్ లైన్కు వచ్చే ఫిర్యాదులను జిల్లా, మండల గ్రామ స్థాయిలో నమోదు చేయాలన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు ప్రతి నెల మొదటి వారంలో జిల్లాలోని అన్ని పాఠశాలలు, హాస్టల్స్ హెడ్మాస్టర్లు వార్డెన్లకు ఫోన్ చేసి పాఠశాలలో ఎవరైనా లైంగిక వేధింపులకు గురి అయ్యారా, ఉపాధ్యాయులు పిల్లలను కొట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారా అని అడిగి,విద్యార్థుల పూర్తి బాధ్యత హెడ్మాస్టర్స్, హాస్టల్ వార్డెన్లదే అని స్పష్టం చేయాలన్నారు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, సిపిఓ సంజీవరావు, మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి లెనీనా,బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిరా సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.