తట్టెడు మన్ను పోసేవారు లేరా?
- గోతులతో నరకం చూస్తున్న వాహనదారులు
- అధికారులు అలసత్వం వీడాలి
- ప్రజాప్రతినిధులు చోరువా తీసుకోవాలి

యాదాద్రి భువనగిరి జిల్లా : నిత్యం ప్రజల అవసరాల నిమిత్తం వరంగల్, సూర్యాపేట జిల్లాకు వెళ్లే వాహనదారులు సత్వర మార్గంగా ఈ రోడ్డు ఎన్నుకుంటారు. కానీ ఈ రోడ్డు ఇప్పుడు వాహనదారులకు, పాదచారులకు నరకం చూపిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రం నుండి నూనె గూడెం మీదుగా సీతారాంపురం స్టేజి వద్ద జాతీయ రహదారి 365బి వద్ద కలిపే రోడ్డు ఇది. ఇక్కడ నుండి వరంగల్, సూర్యాపేట జిల్లాలకు వెళ్లేందుకు అనువుగా ఉంటుంది. దీంతో నల్గొండ జిల్లా నుండి ఇటుగా వెళ్లేవారికి సమయంతో పాటు దూరం కలిసి వస్తుందని ఈ దారిని ఎంచుకుంటారు.
కానీ ఈ మార్గంలో ప్రయాణించాలంటే నరకం అంటే ఇలా ఉంటుందా అనే మాదిరిగా తయారైంది ప్రస్తుత పరిస్థితి.రోడ్డు పూర్తిగా పాడైపోయి గుంతల మయంగాను, కంకర తేలి అధ్వానంగా తయారైంది. కనీసం తట్టెడు మట్టి పోసిన కొంత ఉపయోగంగా ఉండేది అంటున్నారు జనం. గతంలో కురిసిన వర్షాల కారణంగా గుండాల, నూనె గూడెం మధ్యలో ఉన్న వాగు వద్ద రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. తాత్కాలిక మరమ్మత్తులు చేసి వదిలేసారు. దీంతో అక్కడ గుంటలు ఏర్పడటంతో పాటు వాహనాల పూర్తిగా దెబ్బతింటున్నాయి. ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోకపోవడం, అటు అధికారులు తాము వెళ్లే దారి కాదు కదా తమకు ఎందుకని అలసత్వాన్ని వహిస్తున్నట్లు కనిపిస్తుంది. తిరిగి కొత్త రోడ్డు నిర్మాణం చేయకపోయినా పర్వాలేదు కానీ, కనీసం గోతులను పూడ్చి మరమ్మత్తులు చెపిస్తే చాలు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.