బేడ బుడగ జంగాలకు దళిత బంధు ఇవ్వాలి

రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసాని ఐలయ్య
కొత్తగూడెం : బేడ బుడగ జంగాలకు దళితబంధు స్కీమ్, డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బేడ బుడగ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో బుడిగజంగాల కుటుంబాలు ఎస్సీ జాబితాలో ఉన్న 59 ఉపకులాలలో ఉన్నారని తెలియజేశారు.

రాష్ట్రంలో బుడిగజంగాలు జనాభా 1.2 లక్షల మంది ఉన్నారని, జిల్లాలో 15 వందల కుటుంబాలు నివసిస్తున్నాట్లు చెప్పారు. వీరంతా తమ పొట్టకూటి సంచార జీవితాన్ని గడుపుతున్నారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళిత బంధు ఇలా సంక్షేమ పథకాలు అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బుడగజంగాలు సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందినవారిగా దుర్భరమై జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంచార జాతులు పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో సంక్షేమ పథకాలు అందజేయాలని డిమాండ్ చేశారు. డబల్ బెడ్ రూమ్, దళిత బంధు వర్తింపు చేయకపోతే భవిష్యత్తులో బుడిగజంగాలు నిర్వహించే పోరాటాలలో ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలియజేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు వీర్ల రమేష్, రేపాకుల శ్రీను, భూక్య రమేష్ సంఫీుభావం తెలిపారు. ఈకార్యక్రమంలో బేడ బుడిగ సంఘం సమితి జిల్లాఅధ్యక్షులు సిరిగిరి మురళి, ఉపాధ్యక్షులు తూర్పాటి రామారావు, ప్రధాన కార్యదర్శి విభూది కృష్ణ, అధికారిక ప్రతినిధి తూర్పాటి కోటయ్య, వర్కింగ్ అధ్యక్షులు గంజాయి మారయ్య తదితరులు పాల్గొన్నారు.