ముర్రేడు బ్రిడ్జ్ కి మోక్షం ఏన్నడో ?
- మొనతెలిన ఇనుప చువ్వలు
- అడుగడుగునా గుంతలు
- అస్తవ్యస్తంగా పుట్పాత్

కొత్తగూడెం : ముర్రేడు బ్రిడ్జ్పై ప్రయాణం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో వంతెన మీద ప్రయాణం అంటేనే ప్రసవ వేదన తప్పడం లేదని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. జాతీయ రహదారి కావడంతో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళేందుకు ఇదే ప్రధాన మార్గం అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల పాలిట పెను ప్రమాదంగా మారిన ముర్రేడు బ్రిడ్జ్ కష్టాలు నిత్యం ప్రజా ప్రతినిధులకు కనిపిచండం లేదా అంటూ ప్రజలు ఆగ్రహిస్తున్నారు.

జిల్లా ఉన్నతాది కారులు, ప్రజా ప్రతినిధులు వంతన మీద పచార్లు కొడుతున్నారే తప్పా మరమ్మతులను పట్టించుకోడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు అనుదినం నరకప్రాయంగా మారిన ముర్రేడు బ్రిడ్జ్ సమస్య అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ప్రజలు తీవ్రంగా మండి పడుతున్నారు. సంబందిత శాఖ మరమ్మతులపై దృష్టి సారించడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వంతెన నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా నేటికీ పనులు అసంపూర్తిగానే మిగిలి పోయాయి.

ఆదమరిస్తే అంతే సంగతులు
బ్రిడ్జ్కి మరమ్మతులు లేకపోడంతో వంతెన పై కాంక్రీట్ కొట్టు పోయి ఇనుప చువ్వలు, రేకులు మొన తేలి దర్శనమిస్తున్నాయి. అడుగడుగునా గుంతలతో వంతెన జల్లెడను తలపిస్తోంది. మొన తేలిన ఇనుప చువ్వలు, రేకులతో వాహనాలు పంచర్ అయ్యి అదుపు తప్పి వంతెన మీద ప్రమాదాలు సంభవిస్తే ఎవరు బాధ్యులు అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దివ్యాంగుల బ్యాటరీ బండ్లు, త్రి చెక్ర వాహనాలు వంతెన దాటేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా కేంద్రం కావడంతో వాహనాల రద్దీ రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. దీనికి తోడుగా విద్యా సంస్థలు, ఆసుపత్రలు, వినోదాన్ని, ఆహ్లాదాన్ని పంచే అతిపెద్ద మాద్యమం సినిమా టాకీసులు సైతం బ్రిడ్జ్ చుట్టు పక్కలే అధికంగా ఉన్నాయి. జిల్లా నలు మూలలనుండి వచ్చే ప్రజలు వంతెనపై నడిచే పరిస్థితి లేదు. ఫుట్పాత్ కుంగిపోయి గుంతలు ఏర్పడ్డాయి.
బ్రిడ్జ్పై వాహనాల రద్దీ అధికంగా ఉండటోంది. దీనితో పాదాచారులు అవస్తలు పడుతున్నారు. రాత్రి వేళల్లో భారీ వాహనాలు సైతం పెద్ద ఎత్తున రాకపోకలతో రద్దీగా ఉండే బ్రిడ్జ్ మీద నడిచే సమయంలో ఫుట్పాత్ పై ఉన్న గుంతల్లో కాలుపడి వాహనాల కింద పడే ప్రమాదం లేకపోలేదని పాదాచారులు భయాందోళన చెంతున్నారు.
అధికారుల అశ్రద్ద ప్రజల ప్రాణాల పాలిట పెను ప్రమాదంగా మారిందంటూ ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. కొత్త ప్రభుత్వంలో అయినా మొక్షం కలుగుతందా అని గూడెం వాసులు ఎదురు చూస్తున్నారు.