రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అరైవ్ అలైవ్
- వాహనదారులు స్వీయ క్రమశిక్షణ
- సిఐ కరుణాకర్

కొత్తగూడెం : రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వన్ టౌన్ ఎస్ హెచ్ వో ఎం కరుణాకర్ అన్నారు. అరైవల్ అలైవ్ -2026 లో భాగంగా నేటి నుండి ఈ నెల 18వ తేదీ వరకు చేపట్టనున్న కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరైవ్ అలైవ్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. ఉదయం పోస్టాఫీసు ఏరియాలో, శేషగిరి నగర్ లో వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలు పాటించాలని కోరారు.
రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే ఎదుటి వారి ప్రాణాలతో పాటు,మన ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. విధులలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నా,లేకపోయినా వాహనాలను నడిపేటప్పుడు నియమ, నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించేలా సివిక్ సెన్స్ ను కలిగి ఉండాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి తమ ప్రాణ భద్రతతో పాటు,ఇతరుల భద్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆరు రోజులు పాటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలు, యువతకు వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం అన్నారు. చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు, వాహనదారులు భాగస్వాములు కావాలని కోరారు.
స్వీయ తప్పిదాల వలన రోడ్డు ప్రమాదాలలో ప్రతి ఏడాది ఎంతో మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధాన్యత, డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే ఎదుటి వారి ప్రాణాలతో పాటు,మన ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ కరుణాకర్ తో పాటు ఎస్ ఐ లు, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.