పార్టీ కోసం పని చేసినవారికే పదవులు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యం
- ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

కొత్తగూడెం : కాంగ్రెస్ పార్టీ విస్తరణకు కృషి చేసిన, కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అభయమిచ్చారు. ఏఐసీసీ అబ్జర్వర్ తో కలిసి భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షుల ఎంపిక సమావేశానికి బుధవారం హాజరయ్యారు. ఏఐసీసీ ఆదేశానుసారం పిసిసి సూచనలతో భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు.కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఐసీసీ అబ్జర్వర్ జాన్సన్ అబ్రహం, పీసీసీ అబ్జర్వేషన్ కార్యవర్గ సభ్యులతో, పార్టీ జిల్లా అధ్యక్షులు పొదేం వీరయ్యలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశంలో ప్రసంగించారు.
ముందుగా కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పని చేసిన వారిని మర్చిపోమని హామీ ఇచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కలిసికట్టుగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కృషిని ఎప్పటికీ మరువబోమని ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి అన్నారు. ఇదే ఐక్యతతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ముందుకెళదామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎంతో పారదర్శకంగా పదవులకు అర్హులను ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు. డిసిసి అధ్యక్షుల ఎంపిక కోసం ఏఐసీసీ అబ్జర్వర్, ఎంపీ రఘురాం రెడ్డి సమక్షంలో పలువురు నాయకుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఏఐసిసి అబ్జర్వర్ జాన్సన్ అబ్రహం మాట్లాడుతూ గతంలో ఏ పార్టీ కూడా ఇలాంటి ఎంపిక ప్రక్రియ నిర్వహించలేదని, అర్హులకు పదవులు దక్కాలని కాంగ్రెస్ తొలి అడుగు వేసిందని అన్నారు. దరఖాస్తుల ఆధారంగా జాబితాను పిసిసికి అందజేస్తాము అన్నారు. అనంతరం డిసిసి అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.