ఎస్ఎఫ్ఐ పోరాటంతో జూనియర్ కాలేజి ఏర్పాటు

సుజాతనగర్ : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్థానిక మంచికంటి భవన్లో సమావేశమయ్యి మాట్లాడుతూ సుజాతనగర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయడం హర్షనీయం అన్నారు. సుజాతనగర్, చుట్టు ప్రక్కల ఉన్న గ్రామపంచాయితీలలో చదువుకునే విద్యార్థులు పదవ తరగతి ముగిసిన తరువాత ఇంటర్ చదవాలంటే మండలంలో ఇంటర్ కాలేజి లేక కొత్తగూడెం వరకు రావాల్సి ఉంటుంది.
సుజాతనగర్ నుండి కొత్తగూడెం వరకు రావాలంటే సరైన బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సుజాతనగర్ మండలంలో జూనియర్ కాలేజి ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ ఎన్నో దశలవారి పోరాటాలు నిర్వహించిందన్నారు. 2010లో ఆనాడు ఎస్ఎఫ్ఐ కొత్తగూడెం డివిజన్ అధ్యక్షులుగా ఉన్న లిక్కి బాలరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాల 10వ తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష సైతం చేశారన్నారు. వీలైనంత తొందరగా కాలేజీ నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకొని మండల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. జూనియర్ కాలేజి ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు దన్యవాదాలు తెలిపారు.