వేదిస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలి
- సెక్యూరిటీ గార్డ్కు మెరుగైన వైద్యం అందించాలి
- సిఐటియు డిమాండ్
సింగరేణి : సింగరేణి మణుగూరు ఏరియాలో డ్యూటీకి సంబంధం లేని ఇతర సివిల్ పనులు చేపించడం వల్ల అస్వస్థతకు గురై కొత్తగూడెం సింగరేణి మెయిన్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్ పి వీరబాబు శుక్రవారం సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు నాయకులు నాయకులు పరామర్శించారు. సంఘటనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు సూరం ఐలయ్య, భూక్య రమేష్ ,గుగులోత్ సక్రం లు మాట్లాడుతూ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉండి ప్రస్తుతం పిట్ ఉండి మణుగూరు ఏరియాలో ప్రవేట్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న పి వీరబాబును మరి కొంతమంది సెక్యూరిటీ గాడ్స్ పై మణుగూరు ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ కే శ్రీనివాసరావు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని, గురువారం మణుగూరు ఓసి 2 దగ్గర అటవీ ప్రాంతంలో సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ వారు చేయవలసిన పనులను ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్లతో చేపించారని దీని ఫలితంగా పి వీరబాబుకి గతంలో సర్జరీ అయిన ప్రదేశంలో ఒత్తిడి పెరిగి తీవ్ర అస్వస్థకు గురి కావడంతో మణుగూరు ఏరియా హాస్పిటల్ నుండి కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్కు రిఫర్ చేసి వైద్యం చేస్తున్నట్లుగా సీఐటీయూ తెలిపారు.
సింగరేణిలో సంస్థను రక్షించే పనిలో విధులు నిర్వహించే ప్రైవేటు సెక్యూరిటీ గార్డులతో వారి డ్యూటీలకు సంబంధం లేని ఇతర పనులను అప్పగించి అనారోగ్యం పాలు కావడానికి కారణమైన ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో సెక్యూరిటీ విభాగంలో కొంతమంది అధికారులు ప్రైవేటు గార్డుల పట్ల చిన్న చూపు చూడడం, వారితో ఇంటి పనులు వంట పనులు సొంత పనులు చేయించుకోవడం, డ్యూటీకి సంబంధం లేని ఇతర పనులు చేపిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పి వీరబాబు కు పూర్తిగా తగ్గేవరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని,చికిత్స కాలానికి నష్టపరిహారం చెల్లించి వేతనం కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు.