అసమర్థత కప్పిపుచ్చేందుకే ఆరోణలు
- చైర్పర్సన్ పదవి పొంగులేటి భిక్ష
- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవిప్రసన్న

కొత్తగూడెం : అవినీతి పాలనకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదని, ప్రజా పాలనపై అక్కసుతోనే కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ విమర్శిస్తున్నారని కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షుడరాలు తోట దేవి ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడి కాంగ్రెస్ ప్రజాపాలకు పట్టం కట్టారని స్పష్టం చేశారు. చైర్పర్సన్ ఇంకా అధికార భ్రాంతిలోనే బతుకుతున్నారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పానలను విమర్శించడం పై స్పందిస్తూ చుంచుపల్లి మండలంలోని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ తనపై ఉన్న అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు అసత్యాలు ప్రచారం చేస్తూ స్థాయి మరిచి మాట్లాడుతూన్నారని, నేడు అనుభవిస్తున్న పదవి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెట్టిన భిక్ష అని గుర్తు చేశారు. బిఆర్ఎస్ పదేళ్ళ పాలనలో అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువగా జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తుంటే ఓ మహిళ అయ్యి కూడా వ్యంగ్యంగా మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడుగడుగునా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. స్వలాభం కోసం మున్సిపాలిటీలో స్వార్థ రాజకీయాలకు తెరలేపిన ఘనత చైర్పర్సన్కు దక్కుతుందన్నారు. పట్టణ అభివృద్ధిని పక్కకుపెట్టి కౌన్సిల్లో గ్రూపు తగాదాలతోనే కాలయాపన చేశారని మండి పడ్డారు. ప్రజాధారణ కోల్పోవడంతో పదవీ కాలం ముగుస్తుందన్న బెంగతోనే ఇలా మతి భ్రమించి మాట్లాడుతోందని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తుంటే తట్టుకో లేక అక్కసుతో కాంగ్రెస్ పార్టీపై బుదరజల్లే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహించారు. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలను విమర్శిస్తే సహించేది లేదని, భవిషత్తులో పునరావృతం అయితే తగిన గుణపాటం చేబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు బాలిశెట్టి సత్యభామ, తొగరు రాజనళిని, రైల్వే సెంట్రల్ బోర్డు మెంబర్ వై శ్రీనివాస్ రెడ్డి, తలుగు అనీల్, నాయకులు బాలిశెట్టి సుందర్ రాజ్, పవన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.