పర్యాటక కేంద్రంగా సింగభూపాలెం ప్రాజెక్టు
-
మంత్రి జూపల్లిని కలిసిన నాగా సీతారాములు

హైదరాబాద్ : కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం ప్రాజెక్టును పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు నిధుల మంజూరు చేస్తానని మంత్రి జూపల్లి క్రిష్ణారావు హామీ ఇచ్చారని టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు అన్నారు. సింగభూపాలెం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా మార్చాలని ఇటీవల ఎంపీ రఘురాం రెడ్డితో కలిసి మంత్రిని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఎన్నో వనరులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, అందులో భాగంగా భద్రాద్రి జిల్లాలో ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక, వారసత్వ సంపదకు నెలవుగా ఉందన్నారు. ఇలా ఎన్నో అవకాశాలు, వనరులు ఉన్నప్పటికీ, గడిచిన పది ఏళ్ళలో బిఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్న క్రమంలో జిల్లాలోని సింగభూపాలెం ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు కృషి చేయాలని మంత్రికి కోరినట్లు చెప్పారు. దీనిపై డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపి రఘురాంరెడ్డిల ద్వారా నివేదిక పంపుతామని ఆయన అన్నారు. మంత్రిని కలిసిన వారిలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు.