కలెక్టర్ సతీమణి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం
- హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తన పని తీరుతో పాటు ఆయన నిబద్దతకు జిల్లా వాసలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ జితేష్ వి పాటిల్ పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించారు. కలెక్టర్ సతీమణి గర్భం దాల్చిన రోజు నుండి పాల్వంచలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అంటే వైద్య సదుపాయాలు సరిగా ఉండవని, డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనే అపనమ్మం చాలా మందిలో ఉంటే, మరి కొందరికి ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే చిన్నచూపు, తెలియని ఆందోళన.
సామాన్యులు సైతం కార్పోరేట్ ఆసుపత్రులవైపు పరుగులు తీస్తున్న వేళ జిల్లా కలెక్టర్ మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా తన సతీమణిని ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం చేయించడం గొప్ప విషయం. కలెక్టర్ భార్య పాల్వంచలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన జిల్లా ప్రజలు కలెక్టర్ స్థాయి వ్యక్తి ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో తన భార్యకు ప్రసవం చేయించడం హర్షనీయం అంటూ కలెక్టర్ జితేష్ వి పాటిల్ను అభినందిస్తున్నారు. ఈ చర్యతో కలెక్టర్ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.