ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి
- 24 గంటలు అందుబాటులో ఉండాలి
- కలెక్టర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆకస్మిక తనిఖీ

పాల్వంచ : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఆసుపత్రిని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
ఔషధ నిల్వలు స్టాక్ పెట్టుకోవాలన్నారు. ఆసుపత్రిలో రోగులకు శుచికరమైన, బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలని సూచించారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. వివిధ సమస్యలతో ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
ముందుగా కలెక్టర్ ఆస్పత్రిలోని మందులు అందించే గది, రక్త పరీక్ష కేంద్రం, ఇన్ పేషెంట్ వాట్, గర్భిణీ స్త్రీల వార్డ్,మందులు నిల్వ చేసే స్టోర్ రూమ్ను పరిశీలించారు. ఇన్ పేషెంట్ లో ఉన్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఔట్ పేషెంట్ వివరాలు, సిబ్బంది వివరాలు, మందులు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. కుక్క కాటు ఇచ్చే వ్యాక్సినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ తనిఖీలో కలెక్టర్ పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్డెంట్ రాంప్రసాద్, డాక్టర్లు శైలేష్, మోహన్ వంశీ, ప్రసాద్, రాంప్రసాద్, లావణ్య, నర్సింగ్ సూపర్డెంట్ సరళ సిబ్బంది పాల్గొన్నారు.