చేతబడి నెపంతో చంపేశారు
దగ్గర బంధువులే దారుణంగా హతమార్చారు?
జూలూరుపాడు : మూఢనమ్మకపు మూర్ఖత్వంతో ఓ అమాయకుడి ప్రాణాన్ని బలి తీసుకున్న సంఘటన భద్రాద్రి జిల్లాలో చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నాడు అనే అనుమానంతో కుంజా భిక్షంను అతని దగ్గర బంధువులే దారుణంగా చంపేశారు. జూలూరుపాడు మండలం గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. రాచబండ్ల కోయగూడెం గ్రామానికి చెందిన కుంజా ప్రవీణ్, మల్కం గంగయ్య (అలియాస్ గంగులు) చేతబడి చేస్తున్నాడు అనే నెపంతో కుంజా బిక్షం(40) అనే వ్యక్తితి దారుణంగా హత్య చేశారు. స్థానికుల కథనం ప్రకారం గత కొంతకాలంగా ప్రవీణ్, అతని తల్లి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. వరుసకు బాబాయి అయిన బిక్షంకు చేతబడి వస్తుందనే అనుమానం ప్రవీణ్ మనసుల్లో బలంగా నాటుకుపోయింది.
చేతబడి చేయటం వల్లనే తరచూ అనారోగ్యానికి గురవుతున్నట్లు భావించిన ప్రవీణ్ బిక్షం మీద కోపం పెంచుకున్నాడు. ఈ నేపద్యంలో గ్రామంలో ఓ యువకుడు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆదివారం అతని దశదిన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రవీణ్ అతని మామ గంగులుతోపాటు మృతుడు బిక్షం కూడా పాల్గొన్నారు. తమ అనారోగ్యానికి కారణం బాబాయి అని అతనిపై ద్వేషంతో రగిలిపోయాడు. తమ కుటుంబం రోగాల భారిన పడటానికి కారణమైన బిక్షాన్ని చంపడానికి ఇదే అదునుగా భావించిన ప్రవీణ్ తన మామ గంగులుతో కలిసి పథకం పన్నాడు. రాత్రి మధ్యం తాగేందుకు గ్రామ సమీపంలోని వేపలవాగు చెక్డ్యామ్ వద్దకు బిక్షాన్ని తీసుకెళ్లి మద్యం సేవించారు.
ముందస్తు పథకం ప్రకారం మామ, అల్లుడు ఇద్దరూ కలిసి బిక్షం మొఖం, తలపై రాళ్ళతో మోది అతి కిరాతకంగా హత్య చేశారు. మృతదేహాన్ని పక్కనే ఉన్న వాగులో పడేశారు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వాగులో నుంచి బయటికి తీయించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్థం నిమిత్తం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బిక్షం హత్యకు మూఢనమ్మకాలు లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీస్ విచారణ చేపట్టినట్లు సిఐ ఇంద్రసేనారెడ్డి వెల్లడిరచారు.